చిన్నారెడ్డి, దివ్యలతో భేటీ
తెలుగునాడు, హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం జరిగిన ” సీఎం ప్రజావాణి” ని శిక్షణ పొందుతున్న తెలంగాణ రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించింది.సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు అంశాలపై సీఎం ప్రజావాణికి వస్తున్న ప్రజలు అందజేసే వినతి పత్రాల దరఖాస్తులను హెల్ప్ డెస్క్ సిబ్బంది సహకారాన్ని ఇవ్వడం, డెస్క్ అధికారులు వాటిని స్వీకరించి ఆన్లైన్లో సంబంధిత శాఖలకు పంపించే విధానాన్ని, ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో జరుపుతున్న సమన్వయ తీరును శిక్షణ పొందుతున్న ఐ.ఏ.ఎస్. అధికారులు పరిశీలించారు. అత్యవసర వైద్య సేవలు అందించే విభాగాన్ని కూడా వారు పరిశీలించారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఐఏఎస్ అధికారులు సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లతో భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి గురించి వారు అడిగి తెలుకున్నారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చిన్నారెడ్డి వారికి తెలిపారు. సీఎం ప్రజావాణిలో సమస్యల పరిష్కారం ప్రస్తుతం 68 శాతం ఉందని, రానున్న రోజుల్లో 70 శాతానికి మించి అత్యుత్తమ ఫలితాలు ఉంటాయని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ప్రజల నుంచి పిటిషన్స్ తీసుకుని సమస్యలు విని సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి, పిటిషన్స్ పై ఎండార్స్ మెంట్ చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చిన్నారెడ్డి వారికి వివరించారు.సీఎం ప్రజావాణి అమలు తీరు తమకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని, భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారంలో తమకు ఇక్కడి అనుభవాలు చాలా ఉపయోగపడతాయని ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రణయ్ కుమార్, సాలోని చాభ్ర పేర్కొన్నారు.