పెంచిన మెట్రో ఛార్జీలను 10 శాతం తగ్గించటం కాదు మొత్తం పెంపునే రద్దు చేయాలి

Facebook
X
LinkedIn

సిపిఎం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్

తెలుగునాడు, హైదరాబాద్ :

హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వాహకులైన ఎల్ అండ్ టి యాజమాన్యం ఇటీవల భారీగా పెంచిన మెట్రో ఛార్జీలలో 10 శాతం తగ్గిస్తున్నామని ఇది మే 24 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటనను సిపిఎం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆహ్వానిస్తూనే మొత్తం పెంచిన చార్జీలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. మెట్రో రైలు ప్రారంభానికి ముందు ఎల్ అండ్ టి యాజమాన్యం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి అదనంగా ఇప్పటికే చార్జీలు వసూలు చేస్తుందని ప్రయాణికుల పై ఇప్పటికే తీవ్రమైన భారం ఉందని ఇలాంటి నేపథ్యంలో చార్జీలు పెంచడం సరైనది కాదని సిపిఎం డిమాండ్ చేస్తుంది. మెట్రో ఆదాయానికి ఖర్చులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 269 ఎకరాల భూమిని ఎల్ అండ్ టి యాజమాన్యానికి ఇచ్చింది. దానిని వ్యాపారీకరించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. రైలు భోగిలను పెంచడం ద్వారా అధికాదాయాన్ని పొందవచ్చు. నష్టా లు కూడా ఈ కాలంలో తగ్గుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు 1300 కోట్లు ఉన్న నష్టం 650 కోట్లకు తగ్గింది. మెట్రో స్టేషన్లలో రిటైల్ వ్యాపార ఆక్యూపెన్సీ కూడా పెరిగింది. ఎల్ అండ్ టి యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా ప్రజలపై భారాలు మోపటం సరైనది కాదు. గత ఆర్థిక సంవత్సరం లో వచ్చిన ఆదాయం 908 కోట్లలో ప్రయాణికుల నుండే 622 కోట్లు మెట్రో కు వచ్చింది. ఇతర వనరుల ద్వారా వచ్చింది కేవలం 285 కోట్లు. 50% మాత్రమే ప్రయాణికుల నుండి మిగిలినది ఇతర వ్యాపార మార్గాల నుండి పొందాలని ప్రభుత్వంతో ఎల్ అండ్ టి యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలో ఉంది. అందుకు భిన్నంగా ప్రజలపై భారాలు మోపటం సరైనది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పెంచిన మెట్రో ఛార్జీలను రద్దు చేసేలా చూడాలని సిపిఎం కోరుతుంది.