తెలుగునాడు, హైదరాబాద్ :
సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే నియోజకవర్గంగా అచ్చంపేటను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే వంద రోజుల్లో ఈ నియోజకవర్గంలో రైతులందరికీ వంద శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే స్ప్రింక్లర్ డ్రిప్ను స్విచ్ ఆన్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక పథక ఉద్దేశాన్ని వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు , ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్, ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి , సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తో కలిసి ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు.
దేశానికే ఒక మాడల్గా, గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి గారు 29 మంది పోడు భూముల రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ, కీలక విషయాలను చెప్పారు. అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గంలో వచ్చే వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చాలి.
ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ను వ్యవసాయానికి, గృహావసరాలకు వినియోగించగా కొంత మిగులు ఉండేలా, ఆ మిగులు విద్యుత్ను ప్రభుత్వ గ్రిడ్కు అనుసంధానం చేయడానికి అనుగుణంగా ఉండే ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి.
మిగులు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా నెలకు 3 నుంచి 5 వేల రూపాయల మేరకు ఆదాయం లభించాలి.