స్వయం సంఘాల గ్రూపులకు ఆరోగ్య భద్రత.

Facebook
X
LinkedIn

మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డు

ఈనెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు

విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

తెలుగునాడు, హైదరాబాద్ : 

రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత( కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సిఎం సూచించారు. ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటాబేస్‌ను తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కార్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సిఎం అధికారులకు సూచించారు.ముఖ్యంగా మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్ చేయించడం, హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయించడం, ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సాయం అందించకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తుగా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా వారికి సాయం అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్‌లో వి హబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల() ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సిఎం రేవంత్ సందర్శించారు. మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు.కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలని, వారిని ఆర్థికంగా నిలబెట్టాలని సిఎం రేవంత్ అన్నారు. ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. దేశాన్ని గెలిపించే శక్తి మహిళలకుఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నారు.ఆ లక్ష్య సాధనలో భాగంగానే మహిళలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సిఎం రేవంత్ తెలిపారు.. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఒక్కో మహిళ నెలకు దాదాపు 5 వేల రూపాయల మేరకు ఆదా అయ్యిందన్నారు. ఆర్టీసి కూడా లాభాల బాట పట్టిందన్నారు. ఆర్టీసి ద్వారా బస్సులను నడుపుకోవడానికి మహిళా గ్రూపులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించామన్నారు. అవసరమైతే భవిష్యత్‌లో మరిన్ని బస్సులను కేటాయిస్తామన్నారు. రూ. 500 లకే సిలిండర్, పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించామని సిఎం రేవంత్ తెలిపారు.