న్యూఢిల్లీ :
జమ్మూ కాశ్మీర్లో మానవత్వాన్ని చీల్చి వేసేలా ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పహల్గాం వద్ద పర్యాటకులపై దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ మరోసారి ముసుగుతీసింది.
ఈ ఆపరేషన్లో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్లో అంత్యక్రియలు జరిపారు. ఇందులో అమెరికా ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది హాఫీజ్ అబ్దుర్ రవుఫ్ మౌలానాగా వ్యవహరించడం గమనార్హం. అంతే కాకుండా, ఉగ్రవాదుల శవాలపై పాకిస్తాన్ జాతీయ జెండాలు చుట్టడం పాక్ ఉగ్ర మద్దతును పటిష్ఠంగా చూపిస్తోంది.
ఈ అంత్యక్రియల వీడియోలు బయటపడటంతో, భారత ప్రభుత్వం కఠినంగా స్పందించింది. “ఇది పాకిస్తాన్ ఉగ్రవాదానికి బహిరంగ మద్దతు ఇస్తున్నట్లు నిరూపించే తార్కిక ఆధారం” అని భారత అధికారి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
పక్కనే ఆర్మీ అధికారులు ఉండగా హాఫీజ్ టోపీ ధరించడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మసూద్ అజార్ సోదరుడైన హాఫీజ్ రవుఫ్ ఇప్పటికే లష్కరే తోయిబా కార్యకలాపాల్లోనూ, ఆర్థిక సహాయాల్లోనూ కీలకంగా ఉన్నాడనే ప్రచారం ఊపందుకుంది.
ఈ వీడియోల నేపథ్యంలో, పాకిస్తాన్పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. ఉగ్రవాదానికి ఉమ్మడి ఎదురు తాటే పరిష్కారం కావాలనే వాదన మళ్లీ బలంగా వినిపిస్తోంది.