జంటనగరాల్లో అమలులోకి వచ్చిన హైదరాబాద్ సిటీ పోలీస్‌ యాక్ట్

Facebook
X
LinkedIn

హైదరాబాద్ సిటీ పోలీస్‌ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ 

హైదరాబాద్ :

భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ. దీంతో వెంటనే అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో   భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్‌ యాక్ట్ అమలులోకి వచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్   వెల్లడించారు. సెక్షన్ 67 (సి) కింద తన అధికారాలను ఉపయోగించారు సీపీ. ప్రజల భద్రత కోసం మిలటరీ కంటోన్మెంట్ ప్రాంతాలలో, చుట్టుపక్కల ప్రజల భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు లేదా బాణసంచా పేల్చడం నిషేధం విధించారు. ప్రస్తుత భద్రతా వాతావరణం దృష్ట్యా, పటాకులు కాల్చిన పేలుడు లేదా తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని.. భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగే అవకాశం ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, సమావేశాలు, కార్యక్రమాలలో పటాకులు పేల్చడం నిషేధమన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఆంక్షలు తక్షణం అమలులోకి వస్తాయని తెలిపారు.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మరోవైపు నగర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సీపీ సీవీ ఆనంద్ ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తుపై పోలీసులకు సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ఆందోళన వద్దని.. భయాభ్రాంతులకు గురికావద్దని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే నగరంలో అనుమానాస్పద వ్యక్తులపై కూడా పోలీసులు ఫోకస్‌ పెట్టారు.