అత్యవసర పరిస్థితుల్లో ప్రజల అప్రమత్తం చేయాలి : రేవంత్ రెడ్డి

Facebook
X
LinkedIn

తెలుగునాడు హైదరాబాద్ :


ఆపరేషన్ సిందూర్, హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ నిర్వహించిన నేపథ్యంలో పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తో కలిసి మరోసారి సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇలాంటి కీలక సమయాల్లో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపైన ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

రక్షణ రంగంలో వ్యూహాత్మకమైన హైదరాబాద్‌లో అవసరమైన అన్ని చోట్ల గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి.

తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకుని పనిచేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి.

భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (8వ తేదీ) సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీ, అందుకు తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి , డిప్యూటీ సీఎం అధికారులతో చర్చించారు. ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని భారత సైనిక బలగాలకు సంఘీభావంగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.