తెలుగునాడు, హైదరాబాద్ :
రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మల్కాజిగిరి జోన్ లోని నేరేడ్ మెట్ సీపీ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించారు. రాచకొండ కమిషనర్, ఆర్కేఎస్సీ చైర్మన్ జి.సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా వైద్య సేవలను అందుకున్నారు.
అనంతరం రాచకొండ సిపి గారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల దృష్టి సారించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

ఈ ఆరోగ్య శిబిరంలో మామోగ్రఫీ, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నోటి క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఎక్స్రే మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్తో సహా వివిధ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందించారు. దీనికి అదనంగా, సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ డిజిటల్ ఉచిత కంటి పరీక్ష అందించగా, సౌజన్య దంత సంరక్షణ ఆసుపత్రులు దంత సంరక్షణకు అవసరమైన పరికరాలు మరియు మౌలిక సదుపాయాలను అందించాయి. డాక్టర్ కె.కల్పన రఘునాథ్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడం, దాని నివారణ చికిత్సా, జీవనశైలి మార్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీలు పద్మజ ఐపీఎస్, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డిసిపి క్రైమ్స్ అరవింద్ బాబు, ఉమెన్ సేఫ్టీ డిసిపి ఉషా విశ్వనాథ్, డిసిపి అడ్మిన్ ఇందిరా, డిసిపి సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రటరీ రాధిక నాథ్, ఆర్కేఎస్సీ చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.