యువతకు నైపుణ్యాభివృద్ధి, సాధికారతకు యునిసెఫ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

Facebook
X
LinkedIn

మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంవోయూ

తెలుగునాడు, గుంటూరు :

రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యునిసెఫ్ తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, యూనిసెఫ్ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ, యునిసెఫ్ యువాహ్ ప్రతినిధులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యునిసెఫ్, ఏపీఎస్ఎస్ డీసీ పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (YFSI), యూత్ హబ్, పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) కార్యక్రమాలను అమలుచేయనున్నారు. ఇంటికో వ్యాపారవేత్త, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇవి ఎంతగానో తోడ్పాటును అందించనున్నాయి. యువతలో నవీన ఆవిష్కరణలు, ఇంక్లూజన్, స్థిర జీవనోపాధి అవకాశాలను పెంపొందించనున్నాయి.

యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉద్యోగ సృష్టి, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు యూనిసెఫ్ గ్లోబల్ UPSHIFT ఫ్రేమ్‌వర్క్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. యూత్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానించిన బహుభాషా డిజిటల్ వేదిక ద్వారా యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, వాలంటీర్‌షిప్ అవకాశాలను కల్పిస్తారు. పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) కార్యక్రమం ద్వారా 15 నుంచి 29 సంవత్సరాల మధ్యగల యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్, ప్రొఫెషనల్ నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్, ఏపీఎస్ఎస్ డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, యునిసెఫ్ ఏపీ, కర్ణాటక, తెలంగాణ ఫీల్డ్ ఆఫీస్ సీఎఫ్ వో జిలాలిమ్ బిర్హాను టఫెస్సే, ఫీల్డ్ ఆఫీస్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళీకృష్ణ మదమంచి, యూనిసెఫ్ ఇండియా అడాలసెంట్ అండ్ యూత్ డెవలప్ మెంట్ స్పెషలిస్ట్ మానస ప్రియా వాసుదేవన్, స్టాక్ హోల్మ్ డిజిటల్, ఏఐ, స్ట్రాటజీ, ఆఫీస్ ఆఫ్ ఇన్నోవేషన్ కన్సల్ టెంట్ రవితేజ బాలే, ఏపీ కర్ణాటక, తెలంగాణ యునిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ ఇన్నోవేషన్ కన్సల్ టెంట్స్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.