తెలుగునాడు హైదరాబాద్ :
ప్రఖ్యాత కిటాక్యూషు నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి స్థానిక జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , రాష్ట్ర అధికారులకు కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టకేచీ ఆత్మీయ స్వాగతం పలికారు.
ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యపూరిత నగరంగా పేరుగాంచిన కిటాక్యుషులో గాలి, నీరు, నేల అన్నీ తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన దుస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పరిరక్షణ విధానాలతో కిటాక్యూషు నగరం కోలుకుంది.
ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యూషు నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది.
కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యూషు నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి కి వివరించింది.