తెలుగునాడు, హైదరాబాద్ :
సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి, మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. పూలే గారి స్ఫూర్తితో సామాజిక సాధికారత కోసం తెలంగాణలో సమగ్ర కుల గణన చేపట్టడం, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకున్న విషయాలను ముఖ్యమంత్రి ఈసందర్బంగా ప్రస్తావించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నెక్లెస్ రోడ్డు మార్గం, ఐమాక్స్ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి విగ్రహ ఏర్పాటుకు అవసమైన ప్రణాళికను అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు అధికారులు పాల్గొన్నారు.