ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలుగునాడు, హైదరాబాద్ :
ఇందిరమ్మ లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్ను తీసుకురావడం జరిగిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమీషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది,ఎలాంటి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో 95 శాతం పూర్తికాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88 శాతం పూర్తయింది. త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేపట్టవలసిన కార్యాచరణపై దృష్టి సారించాలని అలాగే అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మొదటి విడతలో నివాసస్దలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని, రెండవ దశలో ప్రభుత్వమే నివాస స్దలంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాధలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్ధ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్ధను రద్దు చేసి లబ్దిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించాం. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇండ్లు నిర్మించుకోవచ్చని చివరి లబ్దిదారుని వరకు ఇండ్ల మంజూరు చేసి నిర్మించే బాధ్యత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.