ఎంత ఖర్చయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

Facebook
X
LinkedIn

                            మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ :

ఎంత ఖర్చయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడారం పనులు సకాలంలో పూర్తి చేయడమే తన విధి అని అన్నారు. మేడారం అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మేడారంలో పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటూనే ఉంటామని, కేవలం ప్రాంగణం అభివృద్ధి కోసమే రూ. 101 కోట్లు కేటాయించామని తెలియజేశారు. అన్ని హంగులతో 90 రోజుల్లో పనులు పూర్తి చేయాలని, మేడారం అభివృద్ధికి రూ. 212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ వేశామని అన్నారు. నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధమని, మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.