రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ :
ఒక్క ఫోటో వెయ్యి భావాలను తెలియచేస్తుందని, రాష్ట్రంలో ఫోటోజర్నలిస్టుల సంక్షేమానికి వారిలో ప్రొఫెషనలిజం పెంపొందించేందుకు చర్యలు చేపడుతామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో విజేతలకు నేడు బహుమతి, నగదు పురస్కారం అందించే కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంజాగుట్టలోని ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సమాచారశాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక, సిఎం కార్యాలయం సీపీఆర్ఓ మల్సూర్లు అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, కాలాన్ని బంధించి మధుర స్మృతులను అందించే శక్తి ఒక్క ఫోటోగ్రఫర్లకే ఉంటుందని, వారిని ప్రోత్సహించే దిశగా ప్రతీ సంవత్సరం వరల్డ్ ఫోటోగ్రఫీడేను అధికారికంగా నిర్వహించి, ఫోటో కాంపిటిషన్లలో విజేతలను నగదు బహుమతులు, మెమెంటోలను ప్రదానం చేస్తున్నామని వెల్లడించారు. మాయని జ్ఞాపకాల, తీయాని కల ఫోటోగ్రఫీ అని పేర్కొంటూ, ఎన్నో దశాబ్దాలు గడిచినా ఒక్క ఫోటో మాయని గత స్మృతుల్ని తెలియచేస్తుందని అన్నారు. రాజీవ్ గాంధీ హత్యోదంతాన్ని గుర్తు చేస్తూ, ఆ సంఘటనలో ఉన్న ఫోటోగ్రాఫర్ తీసిన చిత్రం ద్వారానే హంతకులను పట్టుకున్న ఉదంతాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేది ఫోటో జర్నలిస్టులని అన్నారు. స్వాతంత్రోద్యమం నుండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రచార మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిలో ఫోటోగ్రఫీకి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక మాట్లాడుతూ, కాలం గడచినా, ఫోటోలు మాత్రం చెక్కుచెదరకుండా గత మధుర స్మృతులను మిగులుస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాలన్నీ సమాచార శాఖ ఆధ్వర్యంలో గత 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి 5 విభాగాలకు నిర్వహించిన ఫోటో కాంపిటీషన్కు 94 మంది పాల్గొని 744 ఫోటోలను పంపించారని చెప్పారు. ఫోటోగ్రఫీ రంగంలో నిష్ణాతులైన వారిచే ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విజేతలను ఎంపిక చేసిందని వివరించారు. ప్రధానంగా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, రాజీవ్ యువ వికాసం, జనరల్ అనే ఐదు విభాగాలుగా ఎంట్రీలను ఆహ్వానించి ప్రతీ విభాగానికి 8 బహుమతులను ప్రకటించామని తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పోటీలలో పాల్గొన్న విజేతలకు నగదు , శాలువాతో పాటు మెమెంటోను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సి.ఎస్. రామకృష్ణా రావు, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఆర్ఓ మల్సూర్లు అందచేశారు.