ఈడీ విచారణకు అల్లు అరవింద్..

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను   ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు   ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్‌లో   అరవింద్‌ను మూడు గంటలపాటు విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేశారు. 2018-2019లో జరిగిన బ్యాంక్ స్కామ్‌లో ఈడీ విచారణను కొనసాగిస్తోంది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణను చేపట్టింది. గతంలో బ్యాంక్‌కు సంబంధించి అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోంది ఈడీ. ఇప్పటికే అల్లు అరవింద్‌ను విచారించిన అధికారులు.. బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని నిర్మాతను ఈడీ అధికారులు ఆదేశించారు.2024లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో సోదాలు చేసిన ఈడీ.. రూ.1.45 కోట్లను సీజ్ చేసింది. నిందితులు రూ.101.48 కోట్ల రుణ నిధులను మోసపూరితంగా మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో అకౌంట్ హోల్డర్స్‌గా ఉన్న వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంక్ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి రూ.100 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.