రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి, సవాళ్లకు సిద్దం
బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి సవాల్
హైదరాబాద్ ;
ఢిల్లీలో ఉండే మోడీ అయినా, గల్లీలోని కేడీ అయినా.. రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి, సవాళ్లకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గట్టి సవాల్ విసిరారు. కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్ రెడ్డి గర్వంగా వెల్లడించారు. 24 గంటల ఉచిత కరెంట్, రుణ మాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్ చేశారు. రైతుల బాగు కోసం ఎవరు ఎంత చేశారో తేల్చుకునేందుకు రావాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు, పథకాలను అమలు చేస్తోందన్నారు సీఎం. అనేక కష్టాలు ఎదురైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిలబడి, సమస్యలను అధిగమించి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించే దిశగా పనిచేస్తోందన్నారు.
రైస్ ఉత్పత్తి, కొనుగోలు
ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఈ ఏడాది 2 కోట్ల మెట్రిక్ టన్నుల రైస్ను ఉత్పత్తి చేసినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రజా పాలనలో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలో రూ. 9 వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులకు ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, ఆర్థిక పునరుద్ధరణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయ విజయ భేరి సభలో సీఎం ఈ మేరకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతోపాటు అనేక మంది కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.