నేతలకు సీఎం రేవంత్రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ :
ఇన్చార్జ్ మంత్రుల పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత ఇన్చార్జ్ మంత్రులకు అప్పగించినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచేలా ఇన్చార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు నిధులు ఇచ్చామని, వాటిని సరిగ్గా ఎందుకు ఆయా జిల్లాల్లో ఉపయోగించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
పని చేయకపోతే డిమోషన్..
అలాగే.. మంత్రి పదవుల కోసం కొంతమంది కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయించడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చినవారు తెలంగాణ రాష్ట్రమంతా తిరగాలని ఆదేశించారు. పదవులు అడగటం తప్పు లేదు.. కానీ నిరసన హుందాగా ఉండాలని సూచించారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండుగా చేసి జాబితా సిద్ధం చేయాలని.. ముందు అందరికీ పని అప్పగించాలని ఆదేశించారు. పని చేసిన వాళ్లది ఒక జాబితా, పనిచేయని వాళ్లది మరో జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్దేశించారు. ఇవాళ(మంగళవారం) గాంధీభవన్లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. పని చేయకపోతే డిమోషన్.. పని చేస్తే ప్రమోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. పని చేయకపోతే పక్కన పెట్టడంలో మొహమాటం అవసరం లేదని తేల్చిచెప్పారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
పదేళ్లు అధికారం మనదే…
గతంలో తాను టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకోమంటే కొందరు నేతలు తీసుకోలేదని గుర్తుచేశారు. తాము సీనియర్లం, ఆ చిన్న బాధ్యత తీసుకోమని తనకు ఆ నేతలు చెప్పారని అన్నారు. ఆ రోజు బాధ్యత తీసుకున్ననాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవులు ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయితే పదవులు వాటంతట అవే వస్తాయని ఉద్గాటించారు. ఇంకో నాలుగు సంవత్సరాలు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2029 ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీలో పనిచేయని వారిని పదవుల నుంచి తొలగించాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావాలంటే.. పార్టీ నేతల పనితీరుపైనే ఆధారపడి ఉందని తేల్చిచెప్పారు. పదేళ్లు అధికారం మనదేనని స్పష్టం చేశారు. పార్టీ పదవిని చిన్నచూపు చూస్తే వారికే నష్టమని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వం జోడేదుల్లాలాగా పనిచేయాలని సూచించారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామని ఉద్ఘాటించారు. పార్టీ నిర్మాణంపైన టీపీసీసీ దృష్టి సారించాలని అన్నారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా పని చేయాలని సూచించారు సీఎం రేవంత్రెడ్డి.
నేతలు కలిసి పని చేయాలి..
మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నేతలు అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయని చెప్పారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని ఉద్ఘాటించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీల వంటి నామినేటేడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహారించాలని కోరారు. మన ప్రభుత్వo చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఉద్గాటించారు. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయని వెల్లడించారు. తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.