జన విజ్ఞాన వేదిక మెడికల్ క్యాంపుకు విశేష స్పందన…

Facebook
X
LinkedIn

జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోట శ్రీనివాస్

తెలుగునాడు, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

బీపీ, షుగర్ మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ అన్నారు. జన విజ్ఞాన వేదిక కాప్రా, మల్కాజ్గిరి, కీసర మండల కమిటీలు తమ సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న 118వ నెల మెడికల్ క్యాంపు ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ క్యాంపులో మొత్తం 150 మందికి సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోట శ్రీనివాస్ మాట్లాడుతూ..
ఇప్పటి జనజీవితంలో అధిక ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చాలా మంది యువత నుంచి వృద్ధుల వరకూ బీపీ, షుగర్ వంటి జీవనశైలితో కూడిన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, చాలా మంది తమ ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా లేకుండా, చివరి దశలో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అందుకే ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాం అని తెలిపారు.

ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని రక్తపోటు (బీపీ), షుగర్ స్థాయిలను పరీక్షించారు. అవసరమైన వారికి తగిన సూచనలు, జీవనశైలి మార్పులపై సలహాలు అందించారు. కాగా, పలువురు వయోజనుల వద్ద షుగర్ స్థాయిలు సగటు మించినట్టు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా డైట్ చార్ట్, వ్యాయామ సూచనల జాబితాను అందించారు.
శిబిర నిర్వహణలో వాలంటీర్ల పాత్ర ప్రస్తావించదగ్గదని శ్రీనివాస పేర్కొన్నారు. యువ వాలంటీర్లు ఎంతో నిబద్ధతతో ముందుండి శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారన్నారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, కోశాధికారి పిట్ల నాగరాజు, మేడ్చల్ జిల్లా కోశాధికారి జెన్నీ, నాయకులు శ్రవణ్ కుమార్, నరసింహారావు, శేషు, కర్ణాకర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, సోమయ్య చారి, వెంకటరమణ, సురేష్, మధు, డాక్టర్లు దేవిక, జయరాజు, దీప్తి, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.