క్లెయిమ్ ప్రక్రియ సరళీకరణతో బాధిత కుటుంబాలకు వేగవంతమైన ఆర్థిక సహాయం
అహ్మదాబాద్ :
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ బీమా సంస్థలు ముందుకు వచ్చాయి. ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థలు క్లెయిమ్ సెటిల్మెంట్ నిబంధనలను సడలిస్తూ, బాధితుల కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించాయి.
మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు:
ఎస్బీఐ లైఫ్ సంస్థ బాధితుల కుటుంబాలను భారం తక్కువ చేసే ఉద్దేశంతో మరణ ధృవీకరణ పత్రం కోసం పట్టుబట్టడం లేదు. పాలసీ, నామినీ వివరాలు, కేవైసీ డాక్యుమెంట్లు, బ్యాంక్ ఖాతా సమాచారం సమర్పిస్తే చాలు. ప్రభుత్వం లేదా అధికారిక డేటాబేస్ ఆధారంగా క్లెయిమ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. 24 గంటల టోల్ఫ్రీ హెల్ప్లైన్ (1800 267 9090)ను కూడా ఏర్పాటు చేశారు.
హెచ్డీఎఫ్సీ లైఫ్ సహాయం:
పోలీసు, ఆసుపత్రి లేదా స్థానిక ప్రభుత్వ శాఖలచే జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా క్లెయిమ్లను ప్రారంభించవచ్చని హెచ్డీఎఫ్సీ లైఫ్ స్పష్టం చేసింది. వేగవంతంగా క్లెయిమ్ ప్రక్రియ సాగుతున్నట్లు పేర్కొంది.
ఐసీఐసీఐ లాంబార్డ్ స్పందన:
ఈ ఘోర ఘటనకు స్పందనగా తమ క్లెయిమ్ పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశామని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐసీఐసీఐ లాంబార్డ్ వెల్లడించింది.
ఇప్పటికే ఎల్ఐసీ ప్రకటన:
దీనికంతకుముందే ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ కూడా ఇదే విధంగా సహాయ చర్యలు చేపట్టినట్టు శుక్రవారం ప్రకటించింది.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్ బాక్స్ లభ్యమవడంతో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. రెండు ఇంజిన్లలో ఒకేసారి లోపం రావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.