జర్నలిస్తుల సమస్యలపై నిరంతర పోరాటం

Facebook
X
LinkedIn

TWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య

హైదరాబాద్ :

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడేది టీడబ్ల్యూజేఎఫ్ సంఘం మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి బసవపున్నయ్య అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం లో టిడబ్ల్యూ జెఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాన కార్యదర్శి బి బసవపునయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల కనీస సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు కావస్తున్న అక్క్రీడిటేషన్ కార్డులకు ఇంకా స్టికర్లు వేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. పేరుకు హెల్త్ కార్డులు ఇచ్చారని, అవి పనిచేయడం లేదని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు తదితర సమస్యలపై సంఘం అవిశ్రాంత ఉద్యమాలు చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం జర్నలిస్టులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు. అలాగే చిన్న పత్రికల పరిస్థితి మరీ దారుణంగా ఉందని వివరాయించారు. సంఘ సభ్యులoదరూ కూడా ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాళికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బి బసవ పున్నయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా..
జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని అన్నారు.


జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ, సమస్యల పై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎంపల్లి పద్మా రెడ్డి, టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పటేల్ నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు రోజా రాణి, ఉప్పల్ కార్యదర్శి వి రామచంద్రమూర్తి, నాయకులు డి శ్రీనివాసరావు, డి కిరణ్ కుమార్ రావు, వెంకట్, కీర్తి శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్ రెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.