రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన కమల్‌ హాసన్‌ 

Facebook
X
LinkedIn

చెన్నయ్ :

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం   పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌  రాజ్యసభ    కు నామినేషన్‌ దాఖలు   చేశారు. శుక్రవారం తమిళనాడు సచివాలయంలో   డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.కాగా, ఇటీవలే చెన్నైలో నిర్వహించిన తన చిత్రం ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దాంతో బుధవారం వేయాల్సిన రాజ్యసభ నామినేషన్‌ను కమల్‌ వాయిదా వేసుకున్నారు. సినిమా వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్‌ వేయాలని భావిస్తున్నట్లు అప్పట్లో తెలిపారు. అయితే, ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం గురువారం విడుదల కావడంతో నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. కమల్‌తో పాటు మరో ముగ్గురు డీఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ వేశారు. సిట్టింగ్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది పి విల్సన్‌, రోకియా మాలిక్‌, మాజీ ఎమ్మెల్యే శివలింగం ఇవాళ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు.కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప్రచారం కూడా చేశారు. దాంతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేందుకు డీఎంకే పూర్తి సహకారం అందించనుంది. జూన్‌ 19న జరిగే రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఎంఎన్‌ఎం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంఎన్‌ఎం కమల్‌ హాసన్‌ పేరును ప్రతిపాదించగానే రాజ్యసభ సీటును ఆయనకు కేటాయిస్తున్నట్టు మిత్రపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. 2024లో ఎంఎన్‌ఎం పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి స్టాలిన్‌ ఈ కేటాయింపు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం ఎంఎన్‌ఎం పార్టీకి శాసనసభ, పార్లమెంట్‌లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.