తెలంగాణ అభివృద్దే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

తెలంగాణ భవిష్యత్తు కోసం కొత్తగా ప్రపంచ భాగస్వామ్యాలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర పురోభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టెక్యూచి (Kazuhisa Takeuchi) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కిటాక్యుషు సహాకారం కోసం ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. గత ఏప్రిల్‌లో జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన సందర్భంగా ఆ నగర మేయర్ కజుహిసా టెక్యూచి తో సమావేశమైనప్పుడు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు సంస్థలతో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LoI) కుదుర్చుకున్నారు.తాజాగా జరిగిన భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కిటాక్యూషు ప్రతినిధి బృందానికి స్వాగతం. జపాన్ పర్యటన సందర్భంగా కిటాక్యూషు నగర ఎకో-టౌన్ మాడల్‌తో చాలా ప్రేరణ పొందాను. మీరిచ్చిన ప్రేరణతోనే తెలంగాణ ప్రభుత్వం అలాంటి నమూనాను హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం కోసం అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో ఈ సహకారం పునాది కానుంది.మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపైన ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. జపాన్ లో అవకాశాలను అన్వేషించాలన్న అభిలాషతో ఇక్కడి విద్యార్థులు జపనీస్ భాషను నేర్చుకోవాలని అనుకుంటున్నారు. మీ సహకారంతో ఔత్సాహికులకు జపనీస్ నేర్పించాలని భావిస్తున్నాం. హైదరాబాద్ నుంచి నేరుగా కిటాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కిటాక్యుషు నగర నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. కిటాక్యూషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉంది. రెండింటి మధ్య స్నేహం సుదీర్ఘ కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను” అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.