ఫ్రాంకో ఇండియా కార్యాలయం ముందు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆందోళన

Facebook
X
LinkedIn

కార్మిక హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మె

వేతనాల ఆలస్యం, అక్రమ ట్రాన్స్ఫర్లు, పని ఒత్తిళ్లకు వ్యతిరేకంగా నిరసన

జూలై 9న అఖిలభారత సమ్మెలో పాల్గొనాలని పిలుపు

తెలుగునాడు, హైదరాబాద్ :

దేశవ్యాప్తంగా కార్మికులపై జరుగుతున్న అక్రమ ట్రాన్స్ఫర్లు, వేతనాల ఆలస్యం, టార్గెట్ల పేరుతో వేధింపులు వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టామని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ అన్నారు. దేశవ్యాప్త మెడికల్ రిప్రజెంటేటివ్స్ మే 21, 22 తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మెలో పిలుపులో భాగంగా గురువారం మల్లాపూర్‌లోని స్వాగత్ కన్వెన్షన్ పక్కన ఫ్రాంకోఇండియా ప్రధాన కార్యాలయం ముందు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీష్ అధ్యక్షత వహించగా, తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మికులపై జరుగుతున్న అక్రమ ట్రాన్స్ఫర్లు, వేతనాల ఆలస్యం, టార్గెట్ల పేరుతో వేధింపులు వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా చేపట్టామని తెలిపారు. ఇది కేవలం ఆరంభమని, భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్మికులను చీల్చే ప్రయత్నాలు విఫలమవుతాయని, వేతన ఒప్పందం చేయకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

కార్మికులకు యూనియన్లు చాలా కీలకం..

మేడ్చల్ జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు పి.గణేష్

కార్మికులకు యూనియన్లు చాలా కీలకమని, హక్కులను కాపాడే సాధనంగా అవి నిలుస్తాయని
మేడ్చల్ జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు పి.గణేష్ అన్నారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక కోడ్ల వల్ల కార్మికుల హక్కులు తుడిచిపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కోడ్ల అమలుకు రాష్ట్రాల అమెండ్మెంట్లు అవసరమని, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించలేదని తెలియజేశారు. కొత్త చట్టాల ప్రకారం కార్మికులకు వేతనాలు ఆలస్యం అయినా, లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని, అధికారాలన్నీ తగ్గించి యజమానులపై ఆధారపడే విధంగా వ్యవస్థను మార్చారని అన్నారు. 8 గంటల పని వేళల బదులు 12 గంటల పని వేళలు అమలు చేసేలా మార్పులు జరిగినట్లు వివరించారు. కార్మిక నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు జూలై 9వ తేదీన నిర్వహించనున్న అఖిలభారత సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి. ప్రభాకర్, దుర్గాప్రసాద్, జగదీశ్వర్ చారి, సాయిరాం, రాజకుమార్, విజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.