ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్టు
తెలుగునాడు, హైదరాబాద్ :
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 190 గ్రాముల హెరాయిన్, ద్విచక్రవాహనం, మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మీడియాకు రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు వివరాలు తెలిపారు. నిందితులు రాజస్థాన్కు చెందిన మహేష్, మహిపాల్గా గుర్తించినట్లు చెప్పారు. హైదరాబాద్లో అధిక ధరలకు నిందితులు హెరాయిన్ విక్రయిస్తున్నారని అన్నారు. నిందితులు రాజస్థాన్కు చెందిన వారైనా నేరేడ్మెట్ పరిధిలో స్థిరపడ్డారని అన్నారు.వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయడంలో వివిధ పద్ధతులు వాడుతున్నారన్నారు. నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసే వారిగా పనిచేస్తున్నారని తెలిపారు. గ్యాస్ రిపేర్కు సంబంధించిన పరికరాల్లో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అన్నారు. గ్యాస్ సిలిండర్ వాల్వ్లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. అనుమానం రాకుండా ఇలాంటి టెక్నిక్స్ వాడుతున్నారని చెప్పారు. ఓలా, ఊబర్, రాపిడో సహా ఇతర మార్గాల ద్వారా వీటిని కస్టమర్లకు చేరవేస్తున్నారన్నారు. 200 గ్రాముల హెరాయిన్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి… దానిని దాదాపు రూ. 23 నుంచి 25 లక్షల వరకు విక్రయిస్తున్నారన్నారు.రాజస్థాన్కు చెందిన శంషుద్దీన్ అనే డ్రగ్ పెడ్లర్ నుంచి నిందితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిదిలో దాదాపు రూ. 88 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని చెప్పారు. పిల్లలు, యువత ఇలాంటి మత్తు పదార్థాలకు బలికావద్దంటే… ప్రజల సహకారం కూడా కావాలని చెప్పారు. డ్రగ్స్ సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని అన్నారు. వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కళాశాలల్లోకి వెళ్లి యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. నిన్న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి తమ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారని సీపీ సుధీర్ బాబు తెలిపారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.